-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, దోమల నివారణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్కు సమీపంలోని సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ ఆధ్వర్యంలో ప్రజారోగ్య విభాగం సిబ్బందితో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ప్రజారోగ్య పరిస్థితులు, పారిశుద్ధ్య నిర్వహణ, వర్షాకాలంలో చేపడుతున్న దోమల నివారణ చర్యలపై సమీక్షించారు.
నగరంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేసి, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నగరంలోని ప్రతి ఆర్వో ప్లాంట్ను ప్రతి నెలా తప్పనిసరిగా నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించాలని వాటిని క్రమ తప్పకుండా అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే బరియల్ గ్రౌండ్స్, పార్కులు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, పరిశుభ్రత ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో మలేరియా, ఇతర దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిరంతరాయంగా ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్, వ్యర్థాల తొలగింపు, డ్రైన్లలో పూడికతీత వంటి కార్యక్రమాలను చేపట్టి దోమల వృద్ధికి అవకాశం లేకుండా చూడాలని సూచించారు. ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ పి. అన్నపూర్ణ, డాక్టర్ ఎన్. గోపాల నాయక్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ దేవిన హరీష్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News