-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న పురపాలక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ, అందిన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, వాటిపై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు అందిన అభ్యంతరాల వివరాలను పరిశీలించి, వాటిపై నిబంధనల ప్రకారం తీసుకున్న చర్యలను కమిషనర్ సమీక్షించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రతి వార్డుకు అవసరమైన పోలింగ్ కేంద్రాల సంఖ్యను గుర్తించి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. 2021లో నిర్వహించిన పురపాలక ఎన్నికల సమయంలో అనుసరించిన విధానాలు, ఏర్పాట్లను పరిశీలించి, ప్రస్తుత ఎన్నికలకు కూడా అవసరమైన మేరకు వాటిని అమలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అదనంగా అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్లు ఏమైనా ఉంటే వాటిని ముందుగానే గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం 64 డివిజన్ల సభ్యుల సామర్థ్యానికి అనుగుణంగా ఉన్న కౌన్సిల్ హాల్ను, డీలిమిటేషన్ నేపథ్యంలో లో 86 వార్డుల సభ్యులకు అనుగుణంగా మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఇందుకు ఇంజనీరింగ్ విభాగం, సెక్రటరీ సెల్ అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన మార్పులు, సౌకర్యాలను సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్రరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు మోహన్ బాబు, రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ డి.ఎస్.ఎస్. శ్రీనివాస్, సెక్రటరీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News