విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం మొగల్రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్ను రీజినల్ ఫైర్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రీజినల్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, రిలయన్స్ స్మార్ట్ యాజమాన్యం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో NOC జారీ చేయడానికి ఆస్కారం లేదని తెలిపారు. తనిఖీల్లో అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని అగ్నిమాపక భద్రతా పరికరాలు పనిచేయడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు.
అధిక జనసాంద్రత ఉండే వాణిజ్య ప్రదేశాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనిచేయని అగ్నిమాపక పరికరాలను వెంటనే మరమ్మతు చేసి, అన్ని భద్రతా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి యాజమాన్యానికి రెండు రోజుల సమయం ఇచ్చినట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా అన్ని అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను, పరికరాలను సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్న అనంతరం మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్తో పాటు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News