అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవ్వడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటి ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News