గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగునీరు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం స్థానిక ఉద్యోగ నగర్ లో నూతన రిజర్వాయర్, స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటుకు ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్, ఎంఎల్సి చంద్రగిరి ఏసురత్నం, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి స్థలాను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డ్ లో ప్రజలకు త్రాగునీరు, మౌలిక వసతుల కల్పనకు స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుజ్జనగుండ్ల ప్రాంతంలో రిజర్వాయర్ పరిధిలో గృహాలు పెరిగినందున పూర్తి స్థాయిలో స్థానిక ప్రజలకు త్రాగునీరు అందడంలేదని ప్రజా ప్రతినిధులు తెలిపిన మీదట ఇటీవల్ జరిగిన కౌన్సిల్ సమావేశంలో రూ.4.5 కోట్ల అంచనాలతో ఉద్యోగ నగర్ లో నూతన రిజర్వాయర్ నిర్మాణంకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అలాగే ఉద్యోగ నగర్ లోనె ఉన్న జిఎంసి కి చెందిన మరో ఖాళీ స్థలంలో వివిధ క్రీడాంశాలకు వీలుగా స్పోర్ట్స్ పార్క్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామని తెలిపారు.ఎంఎల్ఏ, ఎంఎల్సీలు మాట్లాడుతూ ఉద్యోగ నగర్ వద్ద నూతన రిజర్వాయర్ నిర్మాణం వలన సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న స్థానిక ప్రజల దాహార్తి తీరనున్నదన్నారు. స్తానిక ప్రజలు ఎంతో కాలంగా త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగానే వెంటనే కౌన్సిల్ లో పెట్టి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. అలాగే స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటు వలన స్థానిక యువతకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు త్వరగా సిద్దం చేయాలన్నారు.కార్యక్రమంలో కార్పొరేటర్ షేక్ జుమ్మాబి బాబు, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డి.ఈ.ఈ. మహ్మద్ రఫిక్, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News