-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేయనున్న శుభసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న సామాజిక సమాతా సంకల్పం కార్యక్రమాన్ని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఈ నెల 19న విజయవాడ, స్వరాజ్య మైదానంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బహిరంగ సభ జరగనున్నందున జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. శుక్రవారం స్టేడియంను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించి.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా కార్యక్రమ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనమైన స్వరాజ్యమైదానాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17, 18వ తేదీల్లో సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా మానవహారాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం డా. బీఆర్ అంబేద్కర్ జీవితచరిత్రపై లఘు చిత్రాలను ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులను చేయనున్నామన్నారు. కళాశాలల్లో చర్చలు, ఇష్టాగోష్టిలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మండల స్థాయిలో, జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 18వ తేదీవరకు రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవంపై ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
Prajavartha Online Telugu News