– ఖరీఫ్-2024 పంటల బీమా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి: మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సుమారు రూ.1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఖరీఫ్-2024 పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించి, పెండింగ్ బీమా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. కేంద్రం నుంచి ఖరీఫ్-2024 పంటల బీమా నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సమస్యలకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ, రైతులకు అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందేలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి బీమా నిధుల విడుదలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News