అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ‘తెలుగు మహోత్సవం’ రెండు రోజుల వేడుకలు గుంటూరు జిల్లాలోని చారిత్రక ఉండవల్లి గుహల వద్ద జూలై 25న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహలు నందు ఉదయం 6.30 ని.లకు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గాత్ర విద్యార్థులచే తెలుగు భక్తి మరియు సాహిత్య గీతాలతో సూర్యోదయాన్ని ఆహ్వానిస్తూ, గుహల పైభాగంలో సాగే అద్భుతమైన శాస్త్రీయ సంగీత గీతికలతో “సూర్యోదయ సుప్రభాతం” కార్యక్రమం ప్రారంభమైంది.
తదుపరి తెలుగు మహోత్సవం ప్రారంభోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీమతి గద్దె అనురాధ గారు, APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ప్రముఖ గజల గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కె.జి.బి సరిత, తెలుగు సాహిత్య, సంస్కృతి అకాడమీ చైర్మన్ ఎండి విల్సన్ (శరత్ చంద్ర) జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మన మాతృభాష అయిన తెలుగు ప్రాచీనతను, శతాబ్దాల సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మారుతున్న కాలంలో యువతలో మాతృభాషాభిమానాన్ని నింపేందుకే చారిత్రక నేపథ్యం ఉన్న ఉండవల్లి గుహల సాక్షిగా ఈ తెలుగు మహోత్సవంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు కళలు, జానపద మూలాలు, లలిత కళలతో భాషా వైభవాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం శుభపరిణామం అని గద్దె అనురాధ పేర్కొన్నారు.
తెలుగు సాహిత్య వైభవాన్ని తమ రచనల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన మహిళా రచయిత్రులతో ప్రత్యేక సాహిత్య చర్చా వేదిక “ఆమె మాట – అక్షర బాట”.
ఈ కార్యక్రమంలో భాగంగా భవాని దేవి, కుమారి మందలపు హైమావతి, తేళ్ల అరుణ, వసుధా రాణి, సుశీలమ్మ, సింహాద్రి జ్యోతిర్మయి మొల్ల సాహిత్యం నుంచి ఓల్గా సాహిత్యం వరకు ప్రతి కోణంలో మహిళలు ఎలా వారి బాటలో పయనించి లక్ష్యాల వైపు పరుగులు తీస్తూ నూతనాన్ని సాహిత్య విలువలను స్త్రీ తన వంతు పాత్రను ఏ విధంగా నిర్వహిస్తుందో ఈ చర్చా వేదిక సాక్షిగా చర్చించడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ కవులు, సాహిత్యకారులు తెలుగు భాష సాహిత్య ప్రాస్తస్యాన్ని ఉండవల్లి గుహల వైభవాన్ని అనేక సామాజిక సమస్యల మీద “చెట్టు నీడన చిరుగాలి కవిత్వ గాన కార్యక్రమంలో తమ కవితలను చదివి ఆహుతులను అలరించారు. కవులకు ప్రశంసా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంస్కృతి సమితి చైర్ పర్సన్ పొడపాటి తేజస్విని అందించారు. ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ముంజలూరి కృష్ణకుమారి అమ్మమ్మ కథల ద్వారా పిల్లలకు ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించే పంచతంత్ర, నీతి కథలను చెప్పడమే కాక పిల్లల చేత సృజనాత్మకంగా కథలను చెప్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుందరకాండం అంశాన్ని తీసుకొని తోలుబొమ్మలాట కార్యక్రమం ఆహుతులను ఎంతో అలరించింది. కాలాతీతమైన తెలుగు సినీ గేయాలు, ప్రేక్షకుల భాగస్వామ్య గానాలు, పాటల సాహిత్య విశ్లేషణ, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలతో తెలుగు సంగీత సౌరభాన్ని ఆస్వాదించే అపూర్వ సంగీత వేడుక “తెలుగు స్వరాల సంగీత సంబరం” ఆహుతులను ఒలలాడించింది.
ఆంధ్ర సాహిత్య చారిత్రాత్మక విలువలతో కూడిన కార్యక్రమాలు మొదటి రోజు ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ పొడపాటి తేజస్విని నేతృత్వంలో, సాహిత్య మిత్రుల సహకారంతో అంగరంగ వైభవంగా జరిగింది.
Prajavartha Online Telugu News