-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుండటం రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాజధాని అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో అమరావతికి పూర్వ వైభవం వస్తోందని నేడొక ప్రకటనలో పేర్కొన్నారు
అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ ప్రారంభం కానుండటం శుభపరిణామమని మంత్రి తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కావడంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి వేగం పెరుగుతుందని చెప్పారు. అదే సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల నిర్మాణాలు పూర్తి కావడం ముఖ్యమంత్రికి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమన్నారు.
భవిష్యత్ తరాల వారికి…
అమరావతి నిర్మాణం కేవలం భవనాలు, రహదారుల నిర్మాణం కాదని.. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక మౌలిక వసతులతో సమగ్ర రాజధానిని నిర్మించడమే లక్ష్యమని సత్యకుమార్ తెలిపారు. రాజధాని అభివృద్ధితో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి, వాణిజ్య, సేవా రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
“కేంద్రం-రాష్ట్రం సమన్వయం, సీఎం చంద్రబాబు దార్శనికతతో అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా రూపుదిద్దుకుంటుందనే విశ్వాసం ఉంది. అమరావతి అభివృద్ధి పయనంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి” అని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News