-విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ వినియోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
270 మిలియన్ యూనిట్లకు పైగా డిమాండ్
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 270 మిలియన్ యూనిట్లకు పైగా ఉంటోందని అధికారులు మంత్రికి వివరించారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు. డిమాండ్ మరింత పెరిగే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఎంత విద్యుత్ అవసరమవుతుందో ముందుగానే అంచనా వేసి, ఎక్స్ఛేంజీలు, టర్మ్ అహెడ్ మార్కెట్ ద్వారా అవసరమైన విద్యుత్ను ముందుగానే కొనుగోలు చేయాలని సూచించారు.
ఉత్పత్తి యూనిట్ల నిర్వహణ కీలకం
విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే అధికారులు వెంటనే స్పందించి, సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేలా సిబ్బంది, యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సమావేశంలో ట్రాన్స్ కో జేఎండీ, సీఎండీ, ట్రాన్స్ కో డైరెక్టర్లు, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News