-ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు కనీస మద్దతు ధర (MSP) అందేలా ప్రభుత్వం చేపట్టిన రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో భాగంగా తాళ్లపూడి మండలం గజ్జారం రైతు సేవా కేంద్రం (RSK) వద్ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ (PPC) ను కోవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. రైతులకు న్యాయమైన ధర అందేలా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని, మధ్యవర్తుల జోక్యం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రబీ సీజన్కు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కామన్ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2,369, గ్రేడ్-A ధాన్యానికి రూ.2,389గా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 2,19,831 ఎకరాల్లో సాగు జరగగా, సుమారు 8,91,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా క్లస్టరింగ్ అనంతరం మొత్తం 249 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రైతులకు సౌకర్యంగా 242 రైస్ మిల్లులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యం నిల్వ, రవాణా సదుపాయాల కోసం 1.49 కోట్ల గన్నీలు, 2,486 వాహనాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్ 1967, జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 8309487151, వాట్సాప్ షెడ్యూలింగ్ నంబర్ 7337359875 లను సంప్రదించాలని సూచించారు. ఏప్రిల్ 6 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం జరిగినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావు, జిల్లా మేనేజర్ (సి ఎస్) బి గణేష్ కుమార్, ఏడీఏ సీహెచ్. శ్రీనివాస్, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఏఓ తాళ్లపూడి రైతులు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News