గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్.ఐ.ఆర్లో భాగంగా గుంటూరు నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించబడుతుందని, సర్ సర్వే సమయంలో అందుబాటులో లేకపోవడం, స్పందించని వారి ఓట్లు మాత్రమే ముసాయిదా జాబితాలో లేవని, అటువంటి 62,790 మందికి నోటీసులు అందించనున్నామని తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీనలలో భాగంగా నియోజకవర్గాల వారీగా నోటిసులు జారి చేసినట్లు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో – 32,768 నోటీసుల్లో 8,119, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో – 30,022 నోటిసుల్లో 8736 పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్ లు, అభ్యంతరాలు జూలై 31వ తేదీ నుండి స్వీకరించడం, పరిష్కరించడం జరుగుతోందన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేనివారు, ఓటరుగా నమోదు చేసుకొనుటకు ఫారం – 6 తోపాటు డిక్లరేషన్ ఫారం (అనెగ్జలారీ –డి) కూడా జతపరచి ఆగస్టు 30వ తేదీ వరకు సంబంధిత బిఎల్ఓ లకు లేదా స్థానిక ఏఈఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్లలో, 2002 ఎస్ఐఆర్ వివరాలు సమర్పించనివారికి (నో మ్యాపింగ్) లేదా వివరాలు తప్పుగా ఉన్నాయని గుర్తించిన వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నోటీసు అందిన అభ్యర్థులు ఎన్నికల కమీషన్ పేర్కొన్న 11 రకాల ధృవీకరణ పత్రాల్లో అనగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్, 01.07.1987కు ముందు భారత దేశంలో ప్రభుత్వం, స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసు, ఎల్ఐసి, పిఎస్యూలు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్, గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రిక్యులేషన్, విద్యా ధృవీకరణ పత్రం, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, ఓబీసి/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధృవీకరణ పత్రం, అమలులో ఉన్న ప్రాంతాల్లో జాతీయ పౌరుల రిజిస్టర్, రాష్ట్ర/స్థానిక సంస్థలు రూపొందించిన కుటుంబ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇల్లు కేటాయింపు ధృవీకరణ పత్రాలు వంటి వాటిలో వారి వద్ద ఉన్న ఏదో ఒక డాక్యుమెంటును అందించాలని సూచించారు. అందించిన పత్రాలను పరిశీలించిన అనంతరం ఈఆర్ఓ తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
Prajavartha Online Telugu News