-రూ.53.90 లక్షలతో తాగునీటి పథకం ప్రారంభం.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం
-గోపవరపుగూడెంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి.. మరో రూ.1.44 కోట్ల పనులకు మంజూరు – యార్లగడ్డ
-గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామ అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అలానే తాను చేసిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం రూ.1.30 కోట్ల వ్యయంతో పూర్తయిన చిక్కవరం–పురుషోత్తపట్నం రహదారిని, రూ.53.90 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ 1,300 ఓట్లు మాత్రమే ఉన్న చిన్న గ్రామమైన గోపవరపుగూడెంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిక్కవరం–పురుషోత్తపట్నం రహదారిని రూ.1.30 కోట్లతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.53.90 లక్షలతో జల జీవన్ మిషన్ కింద ఆధునిక నీటి సరఫరా పథకాన్ని అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో దాదాపు రూ.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. మూడు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల మరమ్మతులు, సీసీ రోడ్లు, ఆర్వో ప్లాంట్ ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా గ్రామంలోకి వచ్చే రహదారి అభివృద్ధికి రూ.72 లక్షలు మంజూరు చేసి టెండర్ దశలో ఉందన్నారు. నాలుగు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రూ.32 లక్షలు, 200 విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మొత్తంగా మరో రూ.1.44 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని చెప్పారు. గత పదేళ్లలో ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గ్రామస్తులే చెబుతున్నారని, కానీ ప్రస్తుతం తాము గ్రామ సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఎక్కడికి వెళ్లినా కొత్తగా ప్రారంభించిన పనులు లేదా పూర్తయిన పనులను ప్రజలకు అంకితం చేసే పరిస్థితి ఉండటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో మోటార్ల కొరతను గుర్తించి స్థానిక పీఏసీఎస్ ద్వారా రైతులకు మోటార్లు అందించారని చెప్పారు. ఈ సందర్భంగా రైతులకు సహకరిస్తున్న పీఏసీఎస్ అధ్యక్షుడు రవిని అభినందించారు. ఇతర సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతుల అవసరాలను గుర్తించి సహాయం చేయాలని కోరారు. రైతు నేస్తం, విద్యా రుణాలు, సహకార రుణ పథకాలు వంటి ప్రభుత్వ, సహకార రంగ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News