– చెన్నై – కోయంబత్తూర్ సదస్సుల్లో పెట్టుబడుల వెల్లువ
– ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
– CII పార్ట్నర్షిప్ సమిట్కు అంతా సానుకూలం
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ CII పార్ట్నర్షిప్ సమిట్ 2026 ‘కి ముందుగా చేపడుతున్న పెట్టుబడుల ప్రోత్సాహక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (CII) భాగస్వామ్యంతో.. ఏపీఈడీబీ (APEDB) సమన్వయంతో చెన్నై, కోయంబత్తూర్లో మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్షో విజయవంతమైనట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొనగా రాష్ట్రంలో విస్తృత పెట్టుబడి అవకాశాలను ప్రభుత్వ బృందం సవివరంగా ప్రదర్శించింది.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రగతిశీల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, బలమైన మౌలిక వసతులు, వ్యూహాత్మక పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు మరియు పారిశ్రామిక అనుకూల విధానాలను వివరించారు. అలాగే రాష్ట్రంలో సాగుతున్న సుపరిపాలన (Good Governance), వేగవంతమైన వ్యాపార ప్రక్రియలు (Speed of Doing Business), పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు వివరించారు. రాష్ట్రంలో విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా పరిశ్రమలు, పెట్టుబడిదారులను ఆహ్వానించిన మంత్రి, పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యాల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు.
ఇసుజు మోటార్స్, హీరో మోటోకార్ప్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్తో తమకున్న సానుకూల అనుభవాలను పంచుకోవడం, రాష్ట్రంలో ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణానికి నిదర్శనం అని మంత్రి తెలిపారు. మంగళవారం చెన్నైలో జరిగిన సదస్సులో జర్మనీ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్, ఇండో-జాపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ఎస్. పద్మనాభన్, TECC చెన్నై డైరెక్టర్ జనరల్ స్టీఫెన్ హ్సు, పోస్కో (POSCO) చెన్నై ప్లాంట్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ జంగ్ ఊంగ్ కాంగ్తో చర్చలు జరపడంతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి మరియు MSME రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చలు సాగినట్టు మంత్రి తెలిపారు.
బుధవారం కోయంబత్తూరులో జరిగిన సదస్సులో గోల్డ్ రిఫైనరీ, దీని ద్వారా ఎంఎస్ఎంఈ రంగానికి లభించే అవకాశాలపై ఎమరాల్డ్ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కె. శ్రీనివాసన్ గారితో చర్చించినట్టు మంత్రి తెలిపారు. అలాగే
లీప్ గ్రీన్ CEO దేవానంద్ తో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గురించి, జియాన్ ఛార్జింగ్ CEO కార్తికేయన్ పళనిస్వామి, L.G. బాలకృష్ణన్ & బ్రోస్ డైరెక్టర్ మిస్టర్ రాజీవ్ పార్థసారథి, తిరుప్పూర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్. తిరుక్కమారన్, సీగర్ గ్రూప్ ఎండీ రాధాకృష్ణన్తో చర్చలు విజయవంతమైనట్టు మంత్రి తెలిపారు.
ఈ సదస్సుల్లో పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఇండస్ట్రీస్, టూరిజం & హాస్పిటాలిటీ, తయారీ రంగం, పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టులు, లాజిస్టిక్స్ మరియు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులలో ఉన్న విస్తృత అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వివరించామని మంత్రి చెప్పారు. ఈ యేడాది నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న CII పార్ట్నర్షిప్ సమిట్ 2026 కు ఈ చెన్నై-కోయంబత్తూర్ సదస్సుల్లో ఎంతో సానుకూల స్పందన లభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల ఆసక్తిని వాస్తవ పెట్టుబడులుగా మార్చడానికి వేగవంతమైన అనుమతులు, ప్రాజెక్టుల పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ సదస్సుల్లో CII ఆంధ్రప్రదేశ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ జి. సాంబశివరావు, CII చెన్నై ఛైర్మన్ ఆర్.వి. చారి, కోయంబత్తూర్ జోన్ CII ఛైర్మన్ వి. నౌషాద్, వైస్ ఛైర్మన్ మహాలింగం రామస్వామి, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వ మనోహరన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News