రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ రాజమండ్రిలోని లేపాక్షి షోరూమ్ను సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజర్ మౌనిక, సిబ్బంది చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కి సాదర స్వాగతం పలికారు. సంస్థ సిబ్బంది వేతనాలను పెంచినందుకు చైర్మన్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ షోరూమ్లోని వివిధ హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి, షోరూమ్ నిర్వహణ, ఉత్పత్తుల విక్రయాలు, వినియోగదారుల స్పందన, అందిస్తున్న సేవలపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు.
ఢిల్లీ షోరూమ్ తరహాలో ఆధునికీకరణ
ఢిల్లీలో అభివృద్ధి చేసిన లేపాక్షి షోరూమ్ తరహాలో రాజమండ్రి షోరూమ్ను కూడా ఆధునికంగా, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్తో అభివృద్ధి చేయాలని చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. నిపుణులైన డిజైనర్ల సహకారంతో నూతన డిజైన్ను రూపొందించి, హస్తకళా ఉత్పత్తులను ఆకర్షణీయంగా ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
స్థానిక ప్రచారంతో వ్యాపార విస్తరణ
రాజమండ్రి నగరం, పరిసర ప్రాంతాల్లో స్థానిక ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు మరియు ఇతర మార్కెటింగ్ మార్గాలను విస్తృతంగా వినియోగించి లేపాక్షి షోరూమ్కు వచ్చే వినియోగదారుల సంఖ్యను పెంచాలని చైర్మన్ సూచించారు. హస్తకళాకారులు తయారు చేస్తున్న సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించడం, విక్రయాలను పెంచడం, కళాకారుల ఆదాయాన్ని మెరుగుపరచడం లేపాక్షి ప్రధాన లక్ష్యమని డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. రాజమండ్రి షోరూమ్ను ఆధునీకరించడంతో పాటు స్థానిక మార్కెటింగ్ను బలోపేతం చేసి వినియోగదారుల సంఖ్యతో పాటు వ్యాపారాన్ని గణనీయంగా పెంచేలా కార్యాచరణ చేపట్టాలని సిబ్బందికి సూచించారు. హస్తకళాకారుల సంక్షేమం, హస్తకళల అభివృద్ధి, లేపాక్షి షోరూమ్ల బలోపేతం లక్ష్యంగా సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
Prajavartha Online Telugu News