Breaking News

జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం

-2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – 12 విభాగాల్లో పురస్కారాలు
-రూ.2 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పురస్కారాలు – సెప్టెంబరు 28లోగా దరఖాస్తులు
-రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిజం రంగంలో విశేష సేవలందిస్తూ, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి, వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 28వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోగా కింది చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు.

డైరెక్టర్,
సమాచార పౌరసంబంధాల శాఖ,
2వ అంతస్తు, ఎన్టీఆర్ పరిపాలన భవనం,
పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్,
విజయవాడ – 520013.

కమిటీ విచక్షణాధికారంతో ఎంపిక చేసే పురస్కారాలు

కింది మూడు పురస్కారాలకు జర్నలిస్టుల నుంచి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించకుండా, ఎంపిక కమిటీ తన విచక్షణాధికారంతో పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తుంది.
1. వి.ఆర్. నార్ల జీవిత సాఫల్య పురస్కారం
2. కొక్కు అహోబలరావు ఉత్తమ ఫోటో జర్నలిస్టు అవార్డు
3. మద్దూరి అన్నపూర్ణయ్య పేరిట రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంపాదకులకు అందించే అవార్డు

దరఖాస్తుల ఆధారంగా కమిటీ ఎంపిక చేసే అవార్డులు

1. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.2 లక్షలు

అర్హతలు:
జర్నలిజం వృత్తిలో కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి, వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పూర్తికాలపు జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న పేరొందిన తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లో లేదా రాష్ట్రం వెలుపల పనిచేస్తున్న జర్నలిస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు

గ్రామీణ జర్నలిజంలో విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు జర్నలిస్టులకు ప్రముఖ పాత్రికేయుల పేర్లతో మూడు అవార్డులు అందజేస్తారు.

– ఖాసా సుబ్బారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు
– ముట్నూరి కృష్ణారావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు
– మద్దుకూరి చంద్రశేఖరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు

ఒక్కో అవార్డు నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగిన పాత్రికేయులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గ్రామీణ రిపోర్టింగ్‌లో విశేష అనుభవం గడించిన మాజీ జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

3. సావిత్రిబాయి పూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:
రాష్ట్రంలో వెలువడే తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పీరియాడికల్స్‌లో పనిచేస్తున్న మహిళా రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

4. ఉత్తమ కార్టూనిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:
ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రచురితమవుతున్న తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

5. అబుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:
ఉర్దూ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉర్దూ జర్నలిజానికి అందించిన సేవలు, గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చేసిన రిపోర్టింగ్‌, మొత్తం వృత్తిపరమైన పనితీరును ప్రామాణికంగా తీసుకుని అవార్డు గ్రహీతను ఎంపిక చేస్తారు.

6. ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:
కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారమయ్యే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లలో పనిచేస్తున్న జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. దూరదర్శన్‌, రేడియోలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

7. ఉత్తమ వీడియో జర్నలిస్టు అవార్డు

నగదు పురస్కారం: రూ.1 లక్ష

అర్హతలు:
కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో పనిచేస్తున్న వీడియో జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం – ముఖ్య నిబంధనలు

* జర్నలిస్టులు తాము పనిచేస్తున్న సంస్థ, ఉద్యోగ వివరాలు, తమ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తుతో పాటు కనీసం 5 వ్యాసాలు, వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్‌ జతచేయాలి. అవి 2025 క్యాలెండర్ సంవత్సరంలో (01-01-2025 నుంచి 31-12-2025 వరకు) ప్రచురితమైనవి/ప్రసారమైనవి అయి ఉండాలి.

* వ్యాసాలు, వార్తా కథనాలు తదితర ఆర్టికల్స్‌ను ఫొటోకాపీల రూపంలో కూడా దాఖలు చేయవచ్చు.

* అవార్డు గ్రహీతల ఎంపికకు సంబంధించి ఎంపిక కమిటీదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.

* ఏదైనా విభాగంలో తగిన సంఖ్యలో లేదా తగిన ప్రమాణాలతో దరఖాస్తులు అందలేదని కమిటీ భావించినట్లయితే, సంబంధిత అవార్డును ప్రకటించకుండా నిలిపివేసే అధికారం ఎంపిక కమిటీకి ఉంటుంది.

* ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలోని మీడియా రిలేషన్స్ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు: (https://mediarelations.ap.gov.in/media)

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *