-బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి : అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సూర్యారావుపేటలో ఉన్న సతీష్ గ్యాస్ట్రో హాస్పిటల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నిబంధనలు సక్రమంగా పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యానికి శుక్రవారం సాయంత్రం రూ.2 లక్షల భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.
ఆసుపత్రుల్లో ఉత్పత్తయ్యే బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం వేరు చేసి, నిర్దేశిత విధానంలో సేకరించి, శాస్త్రీయంగా పారవేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అధికారులు స్పష్టం చేశారు. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్యానికి, పారిశుధ్యానికి, పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉన్నందున ఇకపై ఎలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
విధించిన రూ.2 లక్షల జరిమానాను డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో విజయవాడ నగరపాలక సంస్థకు జమ చేయాలని, అలాగే వ్యర్థాల నిర్వహణను సక్రమంగా చేపడతామని హామీ ఇస్తూ ఒక సంజాయిషీ లేఖను నగరపాలక సంస్థకు సమర్పించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులు, వైద్య సంస్థలపై తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. అన్నపూర్ణ, సానిటరీ సూపర్వైజర్ సలీం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News