Breaking News

సంక్షేమ పథకాలు దేశానికే తలమానికం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-1 వ డివిజన్ 4 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే తలమానికమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 4 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. హనుమాన్ నగర్లో విస్తృతంగా పర్యటించి.. 176 గడపలను సందర్శించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు బ్రోచర్లను పంపిణీ చేయడంతో పాటు.. స్థానికంగా జరిగిన అభివృద్ధిని వివరించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను నూటికి నూరు శాతం సక్రమంగా అమలు చేయడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు అన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి సైతం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. రైల్వే ట్రాక్ వెంబడి పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించవలసిందిగా పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. చెత్త సేకరణ ప్రతి గడపకు వెళ్లాలని.. వాహనం వచ్చే సమయాన్ని ముందస్తుగా స్థానికులకు తెలియపరచాలన్నారు. అలాగే లోఓల్టేజీ సమస్యలు రాకుండా చూడాలని విద్యుత్ సిబ్బందికి సూచించారు.

సమస్యల సత్వర పరిష్కారానికి ‘జగనన్న సురక్ష’
ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ‘జగనన్న సురక్ష’ పేరుతో నూతన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని మల్లాది విష్ణు తెలిపారు. నేటి నుంచి సెంట్రల్లోని 96 వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సెక్రటరీలు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికి వెళ్లి వాలంటీర్ యాప్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఎటువంటి రుసుము లేకుండా జనన, మరణ, కుల, ఆదాయ, వివాహ, రేషన్ కార్డు మొదలైన 11 రకాల ధ్రువీకరణ పత్రాలను జూలై మాసంలో అందజేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు ఇతర సమస్యల అర్జీలను కూడా ప్రజల నుంచి స్వీకరించి పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం పనిచేస్తుందని మల్లాది విష్ణు వెల్లడించారు.

ఉనికి కోసం టీడీపీ, జనసేన ఆపసోపాలు
రాష్ట్రంలో తెలుగుదేశం పని అయిపోయిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ధాటికి తట్టుకోలేక సొంత నియోజకవర్గంలో గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వంలో సక్సెస్ అయిన పథకాలకు పేర్లు మార్చి కిచిడి మేనిఫెస్టోతో ప్రజలలో అభాసుపాలయ్యారని విమర్శించారు. తన ముఖంతో ప్రజల్లోకి వెళితే ధైర్యం లేక పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని వెళుతున్నారని ఆరోపించారు. టీడీపీ, జనసేన లాంటి ప్రతిపక్షాలు ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చంద్రబాబు, పవన్, లోకేష్ లకు ఏమాత్రం పట్టవని ఆరోపించారు. మరీముఖ్యంగా పవన్‌ కళ్యాణ్ ఆలోచన, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయనది గంటకో నిర్ణయం, పూటకో మాట అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పేరు పలికే స్థాయి కూడా లేని పవన్ కు లేదని.. అటువంటి వ్యక్తిని పచ్చమీడియా ఆకాశానికి ఎత్తేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరు ఎవరితో కలిసినా 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, సీడీఓ జగదీశ్వరి, నాయకులు ఉద్ధంటి సురేష్, కొండా మహేశ్వర్ రెడ్డి, పిల్లి కృష్ణవేణి, బండి వేణు, కొంగితల శివ, వై.శ్రీనివాస్, నాగరాజు, కొలకలేటి రమణి, అనురాధ, భాగ్యలక్ష్మి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *