రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు జూలై 30 న నిర్వహించే ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల కేసులు, మొదలగు అంశాల పై సంబంధిత అధికారులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణాల గురించి వివరించారు. కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపకపోవడం అదే సమయంలో వివిధ సామాజిక మాధ్యమాలలో అపరిచితులతో స్నేహాల వల్ల అక్రమ రవాణాకు గురవు తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఇలాంటి నేరాలు తగ్గుతాయన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పిపోయిన పిల్లల ఆచూకీ అంత సులభంగా లభించదని, అలా తప్పిపోయిన పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని గుర్తుచేశారు. న్యాయబంధు, టెలీ లా పథకాల గురించి ఆమె వివరించారు.ఈ సదస్సులో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ. గాయత్రి దేవి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, త్రాగునీటి సరఫరా, పారిశుధ్య, వైద్య, తపాలా, టెలీ ఫోన్, భీమా సంస్థలు, బ్యాంకింగ్, మొదలగు వివాదాల సమస్యలను పర్మనెంట్ లోక్ ఆదాలత్ ద్వారా సత్వరమైన పరిష్కారం పొందవచ్చని తెలిపారు.ఈ సదస్సులో రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీ.ఎస్.పి. కె. శ్రీనివాసులు మరియు ఇతర పోలీస్ అధికారులు మానవ అక్రమ రవాణా, తప్పిపోయిన మరియు ఆచూకీ తెలియని పిల్లల కేసుల లో తరచుగా వారికి ఎదురయ్యే సవాళ్ళ గురించి వివరిస్తూ వాటిని అధిగ మించెందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జె. మహేష్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ విధుల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఐ.సి.డి.ఎస్. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, స్వయం ఉపాధి సంఘం మహిళలు, సామాన్య ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News