విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశిష్టమైన భారతీయ సంస్కృతికి చేనేత వస్త్రాలు ప్రతీకలుగా నిలుస్తాయని సీనియర్ ఐఎఎస్ అధికారి జానకి అన్నారు. అపురూపమైన నైపుణ్యతతో, సృజనాత్మకతతో చేనేత పారిశ్రామికులు అహర్నిశం కష్టపడి ఇంద్రధనస్సు వంటి చేనేత వస్త్రాలను తయారు చేస్తున్నారని, వాటిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. పటమట ఎన్ టి ఆర్ సర్కిల్ సమీపంలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న చేనేత వస్త్ర ప్రదర్శన ను జానకి సందర్శించారు. చేనేత జౌళి శాఖ, ఆప్కో ఈ తరహా ప్రదర్శనలను ఏర్పాటు చేయటం నేత కార్మికులకు ఎంతో ఉపయోగకరమన్నారు. తరతరాల భారతీయ సంస్కృతి, వారసత్వానికి ప్రత్యక్ష నిదర్శనాలు చేనేత సోయగాలు నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజైనా నేత దుస్తులను ధరించి ఈ కళను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆప్కో జిఎం తనూజా రాణి తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన శనివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
Prajavartha Online Telugu News