-డి.ఆర్.డి.ఎ-వై.కె.పి. ఉద్యోగుల జేఎసి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ పేదరిక నిర్ములనా (సెర్ప్) సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి, సంస్థలో పనిచేస్తున్న అన్ని కేడర్లను క్రమబద్దీకరణ చేయాలని డి.ఆర్.డి.ఎ-వై.కె.పి. ఉద్యోగుల జేఎసి, ఎన్టీఆర్ జిల్లా కమిటీ కోరింది. గురువారం విజయవాడ ధర్నాచౌక్లో డిఆర్డిఎ-వైఎస్ఆర్ క్రాంతి పథం ఉద్యోగుల జేఎసి నిరవధిక సమ్మె జరిగింది. ఈ సందర్బంగా జేఏసీ కమిటి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమాల్లో తమ ఉద్యోగులు ప్రధాన భూమిక పోషించామన్నారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణా రాష్ట్రంలో ఇచ్చినట్లు డిఎతో కూడిన పే స్కేలు అమలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగుల వయస్సు 62 సంవత్సరాలు పెంపు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఎసి నాయకులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News