గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో అనారోగ్య విపత్తు నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మానవత్వంతో ఆదుకునే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్యా శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన మద్దెల పద్మ కుటుంబ సభ్యులను స్థానిక శారదాకాలనీ 25వ లైనులోను లోని మృతురాలి ఇంటి వద్ద బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్యా శాఖ మంత్రి విడదల రజిని, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తీ చేకూరితో కలసి పరామర్శించారు. మద్దెల పద్మ తల్లి మద్దెల కాటమ్మను , కుటుంబ సభ్యులు ఓదార్చి, ప్రభుత్వం అండగా ఉండి అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి విడదల రజని ధైర్యం చెప్పారు. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసిన రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. శారదాకాలనీ పట్టణ ప్రాధిమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంత్రి విడదల రజిని పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్యవిద్యా శాఖ మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో పలువురికి వాంతులు, విరేచినాలతో కూడిన అనారోగ్య సమస్యలు నమోదయ్యాయని చెప్పారు. అందుకు కారణాలపై అన్వేషణ కొనసాగిందని తెలిపారు. మంచినీటి సమస్యే కారణమై ఉండొచ్చునేమో అనే అనుమానాలతో ప్రభావిత ప్రాంతాల్లో పాత పైపు లైన్లను పూర్తిగా తొలగిస్తున్నామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నామని తెలిపారు. మురుగు కాలువలకు సమీపంలోని మంచినీటి పైపు లైనులను మారుస్తున్నామన్నారు. ఈ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు అనారోగ్య కారణాలతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నవారికి మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రత్యేక వార్డును పూర్తి స్థాయిలో సిబ్బందితో ఏర్పాటు చేశామని, వైద్య సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండేలే చర్యలు తీసుకున్నామన్నారు. మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నగరంలో మొత్తం ఏడు వైద్య శిబిరాలు నిర్వహించామని పేర్కొన్నారు. శారదాకాలనీ, లాంచెస్టర్ రోడ్డు, ఐపీడీ కాలనీల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోందన్నారు. శారదా కాలనీ మొత్తం మంచినీటి సరఫరా నిలిపివేశామన్నారు. వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి పంపిణీ కొనసాగుతోందన్నారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు. మెరుగైన వైద్యం అందించడం, మంచినీటి సరఫరాలో లోపాలను నియంత్రించడం లక్ష్యంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ఆ మేరకు అధికారులు వారి వారి విధులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థతి పూర్తిగా అదుపులోకి వస్తోందని చెప్పారు. అయినా సరే మరింతగా సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు అప్రమత్తంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రజలెవరు ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు, నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ ఆషా, ఎస్.ఈ. సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ మధుసూధన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News