– జిల్లాలో 10,150 మంది వాలంటీర్లకు అభినందన పురస్కారాలు
– 9,982 మందికి సేవా మిత్ర, 133 మందికి సేవా రత్న, 35 మందికి సేవా వజ్ర
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాల ఫలాలను అవినీతి రహితంగా, పారదర్శకంగా గ్రామ, వార్డు వాలంటీర్ల సైన్యం లబ్ధిదారులకు అందిస్తోందని.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ వాలంటీర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
సేవా సైన్యానికి సలాం.. అంటూ వరుసగా నాలుగో ఏడాది గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ టి.జమలపూర్ణమ్మ, జిల్లా వక్ఫ్బోర్డు ఛైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి కె.అనురాధ తదితరులతో కలిసి వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గొప్ప ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కులం, మతం, రాజకీయాలు వంటి వాటితో సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రాతిపదికగా సంక్షేమ పథకాల ఫలాలు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజలకు అందుతున్నాయన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని 50 లేదా 100 కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అందించడంలో అవినీతికి తావులేకుండా నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రదానం చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత బాగా పనిచేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
జిల్లాలో మొత్తం 10,150 మందికి పురస్కారాలు:
సచ్ఛీలత, ప్రజలకు అందుబాటు, పనితీరులో ప్రగతి, కుటుంబాల సంతృప్తిస్థాయి, యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, ప్రజలకు అన్ని విధాల సహాయసహకారాలు అందించడం తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం వాలంటీర్లను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తం 10,150 మంది వాలంటీర్లు పురస్కారాలకు ఎంపికయ్యారని.. వీరిలో 9,982 మంది సేవా మిత్ర, 133 మంది సేవా రత్న, 35 మంది సేవా వజ్ర పురస్కారాలకు ఎంపికైనట్లు వివరించారు. సేవా వజ్ర పురస్కారం కింద రూ. 45 వేలు నగదు బహుమతి; సేవా రత్న పురస్కారం కింద రూ. 30,000 నగదు బహుమతి; సేవా మిత్ర పురస్కారం కింద రూ. 15 వేలు నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్లతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో పండగ వాతావరణంలో సత్కార కార్యక్రమం జరగనుందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News