-బిషప్ డాక్టర్ టి.జార్జి కొర్నేలియస్ ని కలిసిన శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రాష్ట్రపరిస్థితులు చాలా దారుణంగా వున్నాయి.., యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. యువతను పెడదారి పట్టించేందుకు మత్తు మందు రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరకుతుంది. ఈ సమస్యలు దృష్టిలో వుంచుకుని…రాష్ట్ర పరిస్థితుల్ని ఎవరైతో చక్కదిద్దగలరో వారికి మద్దుతు ఇచ్చి గెలిపించాలని బిజెపి,జనసేన బలపరిచిన విజయవాడ పార్లమెంట్ టిడిపి అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కస్తూరిబాయిపేట రెడ్ సర్కిల్ లోని బిషప్ హజరయ్య గ్రౌండ్స్ పక్కన వున్న సి.ఎస్.ఐ చర్చి లో కృష్ణ గోదావరి డియోసెస్ చర్చి ఆఫ్ సౌతిండియా బిషప్ డాక్టర్ టి.జార్జి కొర్నేలియస్ ని కేశినేని శివనాథ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆత్మీయ సత్కారం చేశారు. ఈ ఎన్నికల్లో కేశినేని శివనాథ్ విజయవాన్ని కాంక్షిస్తూ బిషప్ డాక్టర్ టి.జార్జి కొర్నేలియస్ ప్రార్ధన చేశారు. ఈ సందర్బంగా శివనాథ్ మాట్లాడుతూ తన రాజకీయ, సేవకార్యక్రమాలకు దళితనాయకులే అండదండగా వున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. చంద్రబాబు హయంలో రాష్ట్రంలో ఎక్కడ చర్చిలపై దాడులు జరగటం కానీ, క్రైస్తవుల ఆస్తులు అన్యాక్రాంతం కావటం కానీ జరగలేదని స్పష్టం చేశారు. అనంతరం బిషప్ డాక్టర్ టి.జార్జి కొర్నేలియస్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడేవారికి తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, దళిత నాయకులు డాక్టర్ కామా దేవరాజు, దళితరత్న పరిసపోగు రాజేష్, దళిత నాయకులు ఇత్తడి చార్లెస్, మాజీ కార్పొరేటర్ నరసింహాచౌదరి, పాస్టర్ రాజు, డాక్టర్ సంఖ్యే విశ్వనాథం పాల్గొన్నారు.