-అర్జీదారులతో నేరుగా ఫోన్లో మాట్లాడుతున్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న పీజీఆర్ఎస్ వ్యవస్థ
-సత్వర పరిష్కారంతో పాటు సంతృప్తికర సేవలందించే దిశగా చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోంది. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల నుంచి అందుతున్న అర్జీలకు తక్షణ స్పందన ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా, డివిజన్, మండలం, మునిసిపల్ స్థాయిలలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం పొందుతున్నారు. అదనంగా 1100 హెల్ప్లైన్, మీకోసం వెబ్సైట్, సీఎంవో వంటి వివిధ మార్గాల ద్వారా కూడా అర్జీలు వస్తుండగా.. వాటిని సమగ్రంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి అర్జీపై నాణ్యమైన, సంతృప్తికర పరిష్కారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సమస్య పరిష్కారం మాత్రమే కాకుండా అర్జీదారుల సంతృప్తి స్థాయిని కూడా తెలుసుకునే విధంగా కలెక్టర్ స్వయంగా ఫోన్ ద్వారా వారితో మాట్లాడుతున్నారు. ఈ విధానం ద్వారా పరిష్కార ప్రక్రియపై ప్రజల నమ్మకం మరింత బలపడుతోంది.
తాజాగా 17 అర్జీలకు సంబంధించిన అర్జీదారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నేరుగా ఫోన్లో మాట్లాడి, వారి సమస్యల పరిష్కార స్థితి, అందించిన సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ చర్యలు ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. జిల్లా పరిపాలన ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని, సమయానుకూలంగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News