అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర శ్రీలంక తీరము, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో మంగళవారం (12-05-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వర్షం పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో ఉన్న రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో(08) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
సోమవారం ఎన్టీఆర్(జి) విజయవాడ తూర్పులో 42.3°C, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం(జి) కూనవరంలో 42.1°C, కర్నూలు(జి) మంత్రాలయంలో 41.5°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 41.4°C, కడపలో 41.3°C, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 41.2°C, పల్నాడు(జి) అచ్చంపేటలో 40.9°C, అనంతపురం(జి) రాయదుర్గంలో 40.8°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి, నంద్యాల(జి) దొర్నిపాడులో 40.7°C,మర్కాపురం(జి) నందనమారెళ్లలో 40.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News