అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై ఐనవోలు, మల్కాపురం గ్రామాలలో APCRDA ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, ఇతర APCRDA అధికారులు హాజరయ్యారు.
రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై నోటిఫికేషన్ విడుదల చేశామని అడిషనల్ కమిషనర్ గారు గ్రామస్తులకు వివరించారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని అడిషనల్ కమిషనర్ గారు గ్రామసభలో స్పష్టం చేశారు. గ్రామస్తులు పలు సమస్యలను అడిషనల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగా.. ప్రాధాన్యత క్రమంలో, ప్రభుత్వ ఆదేశానుసారం ఆయా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున, రాజధాని గ్రామాల రైతులు APCRDA అధికారులకు సహకరించాలన్నారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు స్థానికంగా అందుబాటులో ఉండే కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు బి. సాయి శ్రీనివాస నాయక్, పి.మధుసూధనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News