గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో పెండింగ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి వార్డ్ ల వారీగా కార్యాచరణ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదర్శనగర్ మెయిన్ రోడ్, నల్లకుంట, అంకిరెడ్డిపాలెం చెరువు వాకింగ్ ట్రాక్, శ్మశాన వాటిక ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా చేపట్టారని ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ఆయా పనుల వారీగా పూర్తీ చేయడానికి ఏఈలు, డిఈలు భాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యంగా ఉండే కాంట్రాక్టర్లపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లాక్ లిస్టు వంటి కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. తొలుత అటువంటి వారిని గుర్తించి, నిర్దేశిత టెండర్ అగ్రిమెంట్ మేరకు నోటీసులు ఇవ్వాలన్నారు. అంకిరెడ్డిపాలెం చెరువు, శ్మశానవాటికలో పెండింగ్ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్దం చేసి తమకు అందించాలని, పనులు పూర్తైన అనంతరం స్థానిక కమిటిలు నిర్వహణకు భాధ్యత తీసుకోవాలని కోరారు. సదరు నిర్వహణలో భాగంగా వాచ్ మెన్, క్లీనింగ్ కార్మికులకు అయ్యే ఖర్చు జిఎంసి నుండే ఇస్తామన్నారు. ఆదర్శ నగర్ నుండి అంకిరెడ్డిపాలెం రోడ్ లో పారిశుధ్య పనులపట్ల అసహనం వ్యక్తం చేస్తూ, వ్యర్ధాలు వేసే వారిపై ఫైన్ యాప్ ద్వారా ఎందుకు అపరాధ రుసుం విధించడం లేదని, 2 రోజుల్లో సదరు ప్రాంతంలో పారిశుధ్యం మెరుగుకాకుంటే కఠిన చర్యలు తీసుకుంటా మని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిఈఈ సతీష్ కుమార్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News