విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. గురువారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మందిర అధ్యక్షులు హెచ్.జి. దయానిధి దాస్ వెల్లడించారు. ఈనెల 18వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి ప్రారంభమై, అయ్యప్పస్వామి దేవస్థానం ఫంక్షన్ హాల్ వరకు రథయాత్ర కొనసాగుతుందన్నారు. రథంపై జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. యాత్రలో హరినామ సంకీర్తన, భజనలు, కూచిపూడి, భరతనాట్యం, కోలాటం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, పుష్పాభిషేకం, మహాప్రసాద వితరణ ఉంటాయన్నారు. భగవంతుడే స్వయంగా భక్తుల వద్దకు రావడం ఈ రథయాత్ర ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆలయం ద్వారా ప్రతి ఆదివారం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, నూతనంగా శ్రీకృష్ణ బలరామ గోశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ గోశాల ద్వారా నిరాశ్రితమైన, వృద్ధ గోవులకు సంరక్షణ అందించడమే తమ సంకల్పమని ఆయన వివరించారు. ఈ దివ్య రథయాత్రలో భక్తులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, జగన్నాథుని కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో మందిరం ట్రస్ట్ సభ్యులు అమృత గంగ దేవి దాసి మందిర సెక్రెటరీ దశావతార దాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News