– సృజనాత్మకతకు శిక్షణతో మహిళలకు ప్రోత్సాహం
– ఎకో క్రాఫ్ట్స్, ఫైన్ ఆర్ట్స్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు తమలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్వయం సహాయక సంఘాల మహిళలకు సూచించారు.
శనివారం ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎకో క్రాఫ్ట్స్, ఫైన్ ఆర్ట్స్పై వర్క్షాప్ జరిగింది. నారీ వస్త్ర ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సుష్మ 70 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ మహిళల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. పర్యావరణహిత వస్తువుల తయారీ, కళాత్మక ఉత్పత్తుల రూపకల్పన వంటి అంశాల్లో శిక్షణ పొందడం ద్వారా ఇంటి వద్దే ఉపాధి అవకాశాలను సృష్టించుకోవచ్చన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో పెట్టి స్వయం ఉపాధికి మార్గాలు వేసుకోవాలన్నారు. తయారు చేసిన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించడం, మార్కెట్ అవసరాలు, ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిగతులతో పాటు సమాజ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తున్న శిక్షణ, ప్రోత్సాహకాలు, స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News