దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు హనుమంతుని జన్మదినోత్స వాన్ని పురస్కరించుకుని హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం ఆలయం నందు అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత రెండవ సంవత్సరం హనుమత్ జయంతి అని ఈ దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. భవిష్యత్లో మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని విధాలు సౌకర్యవంతమైన విధంగా తీర్చిదిద్దే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఈరోజు సుమారు 3 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కావించామన్నారు.
దేవాలయంలోని శ్రీ అభయాంజనేయ స్వామికి అర్చకుడు వినయ్కుమార్శర్మ పూజాకార్యక్రమాలు, అభిషేకం, అలంకారం నిర్వహించగా పలువురు హనుమాన్ చాలీసా పారాయణం, వివిధ రకాలైన పూలతో, తమలపాకులు, తదితర పండ్లతో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిశెట్టి శ్రీను, ముద్రబోయిన జగన్, పుసుపులేటి గణేష్, వెంకట్రావు, కఠారి సురేష్, కె.వెంకటేశ్వరరావు, పి.లక్ష్మణరావు, ముద్రబోయిన గోపీ, కూరపాటి ప్రవీణ్, కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News