Breaking News

సమర్ధవంతమైన పోలీసింగ్ కోసం సర్టిఫికేషన్ కోర్సులు

-హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి
-ఏఐ, డిజిటల్ లిటరసీతో పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దాలి
-ప్రజలతో ఫ్రెండ్లీగా… నేరస్థులపై కఠినంగా ఉండాలి
-ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
-ఏపీ అస్త్రం ఆప్ ఆవిష్కరించిన సీఎం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసింగ్ కోసం వివిధ స్థాయిల్లోని పోలీసులకు సర్టిఫికేషన్ కోర్సులను అందించి… వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని, అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను కూడా ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశం గురువారం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం, రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులతో కలిసి భవిష్యత్ పోలీసింగ్‌కు అవసరమైన సంస్కరణలపై సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లిటరసీ ఆధారంగా భవిష్యత్ పోలీసింగ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. 2001లోనే ఇదే తరహాలో ఫ్యూచర్ పోలీసింగ్ వర్క్‌షాప్ నిర్వహించామని గుర్తు చేసిన సీఎం, అప్పటితో పోలిస్తే నేడు నేరాల తీరు, నేరస్థుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరిగాయని, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం పోలీసు వ్యవస్థకు తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.

శిక్షలు పడతాయనే భయం నేరస్థుల్లో పెరగాలి

నేరాలను అరికట్టడమే కాదు… నేరం చేసిన వారికి వేగంగా శిక్షలు పడేలా దర్యాప్తు వ్యవస్థ పనిచేస్తేనే నేరస్థుల్లో భయం ఏర్పడుతుందని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు ప్రణాళికలు, సమర్థవంతమైన దర్యాప్తు, వేగవంతమైన ఫలితాలే పోలీసింగ్‌కు అసలైన ప్రమాణాలన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను రీ-స్ట్రక్చర్ చేయాలని, ఇన్విజిబుల్ పోలీస్… విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే పరిమిత సిబ్బందితోనూ క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించవచ్చని చెప్పారు. ఇందుకు ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండాలని… అదే సమయంలో నేరస్థుల విషయంలో రాజీపడకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. తిరుమల మెట్ల మార్గంలో అపహరణకు గురైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని అత్యంత వేగంగా టెక్నాలజీ సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకున్న ఘటనను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి ఘటనల్లో వెంటనే స్పందించకపోతే ప్రజల్లో అపోహలు వ్యాపిస్తాయని, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అపహరించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని త్వరితగతిన గుర్తించడానికి కారణం టెక్నాలజీనేననే విషయాన్ని గుర్తించాలన్నారు.

దుష్ప్రచారాన్ని వేగంగా తిప్పికొట్టాలి

ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కొందరు రాజకీయంగా నేరాలను కూడా ఉపయోగించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్ మరణం ఘటనలో కొన్ని పార్టీలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నాలుగైదు రోజులు పట్టిందని గుర్తుచేస్తూ, ఇలాంటి వాటి విషయాల్లో త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా ద్వారా జరిగే తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఖండించే సమర్థ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో పురోగతి సాధించినా… ఇంకా పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ కారణంగా కుటుంబాలు నాశనమవుతున్నాయని, మత్తు పదార్థాల ప్రభావంతో జరిగే నేరాలను పూర్తిగా అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు అవసరం

పోలీసు వర్క్‌ఫోర్స్‌కు రీ-ఓరియెంటేషన్ అవసరమని, ప్రతి పోలీసు సిబ్బందికి డిజిటల్ లిటరసీ తప్పనిసరిగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసింగ్‌లో ఏఐ వినియోగాన్ని పెంచాలని సూచించారు. అలాగే వివిధ అంశాలకు సంబంధించి సమర్ధవంతమైన పోలీసింగ్ కోసం శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, సైబర్ నేరాలు, గంజాయి-డ్రగ్స్, మహిళలపై నేరాల నియంత్రణ, కన్విక్షన్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్పీలో శిక్షణ పొందుతున్న సిబ్బందిని అవసరమైతే డెప్యూటేషన్‌పై జిల్లాలకు పంపే అంశాన్ని పరిశీలించాలని, పోలీసు ఉన్నతాధికారులు కూడా వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని సీఎం సూచించారు. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల అనుభవాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నేరాలను అరికట్టడమే కాకుండా నేరాలకు అలవాటు పడిన వారిని సంస్కరించడం.. వారిని కంట్రోల్లో పెట్టడం వంటి చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఫోరెన్సిక్‌కు మరింత బలం

డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ విభాగాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. శాంతి భద్రతలను అదుపు చేయడం… నేరాలను కట్టడి చేయడంలో ప్రణాళికలు రచించడంతో పాటు ఫలితాలు చూపగలగాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామంటూ నాడు జరిగిన కొన్ని సంఘటనలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఏపీ పోలీస్ వెబ్ సైట్, ధర్మ యాప్, విజయవాడ పోలీసులు రూపొందించిన ఏపీ అస్త్రం మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అలాగే రోడ్ సేఫ్టీ, పుష్కరాల్లో సాంకేతిక వినియోగం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ వంటి 8 అంశాలపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ పోలీసులు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, విట్ యూనివర్శిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సదస్సులో హోం మంత్రి అనిత, హోం సెక్రటరీ కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *