విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో “సఫాయి అప్నావో – బీమారి భగావో -2026” కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, అవసరమైన మందుల పంపిణీతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు విజయవాడ నగరపాలక సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య కార్మికుల ద్వారానే ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, ప్రజారోగ్యం సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, యు పి హెచ్ సి డాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News