విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంప్రదాయ జ్ఞాన సముపార్జనతో పాటు సాంకేతిక, విశ్లేషణాత్మక సామర్థ్యాలను కూడా విద్యార్థులు పెంపొందించుకోవాలని దుబాయికి చెందిన ఎ.బి.ఐ.ఎ. కన్సల్టెంట్స్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ ఇబ్రహీం అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కృత్రిమమేధ యుగంలో ఎం.బి.ఎ. విద్యార్థులకు అవసరమయ్యే సామర్థ్యాలు అనే అంశంపై సోమవారం వెబినార్ హాలులో నిర్వహించిన వర్క్షాపులో డా. ఇబ్రహీం మాట్లాడుతూ పరిశ్రమల మారుతున్న అవసరాలను విద్యార్థులు గుర్తించాలని, నాయకత్వ లక్షణాలతో పాటు సృజనాత్మకత, వినూత్న ఆలోచనశక్తి పెంపొందించుకోవాలన్నారు. వ్యాపార సమస్యల పరిష్కారానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించు కోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, సాంకేతికతను మానవ విచక్షణతో మేళవించాలని ఇబ్రహీం సూచించారు. వేగంగా మారుతున్న ఏఐ ఆధారిత వ్యాపార వాతావరణంలో విద్యార్థులు భవిష్యత్ వృత్తులకు సిద్ధం కావాలన్నారు. ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్, డీన్ ప్రొఫెసర్ రాజేష్ సి. జంపాల, అధ్యాపకులు డా.రెహమాన్ ముఖ్య అతిథి డా. ఇబ్రహీంను సత్కరించారు.
Prajavartha Online Telugu News