-అంగన్వాడీ పిల్లలకు బాలామృతాన్ని విధిగా అందించాలి
-పిల్లల పోషణపై తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలోని సక్షం అంగన్వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రం, పాఠశాలలో సౌకర్యాలు, పిల్లల ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోషకాహార లోపం కారణంగా ఎత్తుకు తగిన బరువు లేని పిల్లల వివరాలను అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసిన తీరును పరిశీలించారు. పిల్లలను స్వయంగా బరువు తూయించి, యాప్లో నమోదైన వివరాలతో క్రాస్ చెక్ చేశారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారి తల్లితో జిల్లా కలెక్టర్ మాట్లాడి, బాలామృతాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారో, పిల్లలకు ఆహారం అందించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి పిల్లల విషయంలో తల్లులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పిల్లలకు అందించాల్సిన బాలామృతాన్ని విధిగా అందిస్తూ, వారి ఆరోగ్యం, బరువు పెరుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రస్తుతం బోరు ద్వారా నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేసి, మోటార్ ద్వారా నీటిని ట్యాంకుకు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం ఉర్దూ పాఠశాల ఆవరణను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాలకు కొద్ది దూరంలో నిలిచిపోయిన నీటి సరఫరా పైప్లైన్ను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాలకు తాగునీటి సరఫరా అందేలా నిలిచిపోయిన పైప్లైన్ పనులను పూర్తి చేయాలని ఆర్డీవోను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో గడ్డిపాటి అనిల్ కుమార్, తహసీల్దార్ పాలపర్తి రవికుమార్, ఎంపీడీవో శేఖర్, ఎంఈఓ కెనాడి, సీడీపీవో జి.లక్ష్మీ భార్గవి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News