రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుబజార్ల ప్రధాన కార్యనిర్వాహక అధికారి (Chief Executive, Rythubazars) డాక్టర్ కె. మాధవీలత గురువారం రాజమహేంద్రవరం పరిధిలోని పలు రైతుబజార్లను సందర్శించి, నూతన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం లో నూతన రైతుబజార్ నిర్మాణ పనులను ఆమె తనిఖీ చేశారు. సుమారు రూ.55 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఈ రైతుబజార్ ద్వారా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం 45వ వార్డులో రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్న నూతన రైతుబజార్ పనులను కూడా పరిశీలించి, నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తదుపరి శంభునగర్లోని ప్రస్తుత రైతుబజార్ను సందర్శించిన డాక్టర్ మాధవీలత, అక్కడ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, మార్కెటింగ్ అవసరాలు, సదుపాయాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులకు మరింత అనుకూల వాతావరణం కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు (మార్కెటింగ్) ఎం. సునీల్ వినయ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాంబా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లేశ్వరరావు, విజయవాడ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News