నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె. ఆనందరావు గురువారం నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిశీలించారు. గ్రామానికి చెందిన 85 మంది రైతుల సుమారు 300 ఎకరాల భూమి స్వభావం పట్టాదారు భూముల స్థానంలో బీడు భూములుగా నమోదవడంతో రైతులకు అడంగల్ అందకపోవడం, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, ఈ-క్రాప్ నమోదు జరగకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి, సమస్య పరిష్కారానికి ఆర్డీవో ఆనందరావును ఆదేశించారు. ఆ మేరకు తహసీల్దార్ ఎస్.వి.ఎస్. నాయుడుతో కలిసి గ్రామంలో భూముల నమోదులను పరిశీలించి, 300 ఎకరాల భూములకు సంబంధించిన అడంగల్ నమోదులను సరిచేసి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. సమస్య పరిష్కారంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఆర్డీవో కె. ఆనందరావు, తహసీల్దార్ ఎస్.వి.ఎస్. నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News