విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 ప్రకారం వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసి సంబంధిత రంగుల బుట్టల్లో వేసేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల వేర్పాటుపై ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాల్కు తరలించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాల నిర్వహణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని కమిషనర్ పేర్కొన్నారు. వ్యర్థాలను కేవలం తొలగించడమే కాకుండా, వాటి నుంచి సంపద సృష్టించే విధంగా “వేస్ట్ టు వెల్త్” విధానంలో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా వ్యర్థాలను మూలస్థాయిలోనే వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించడం ద్వారా నగర పారిశుధ్య నిర్వహణలో భాగస్వాములు కావాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ బి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ గోపాల్ నాయక్, జిందాల్ డీజీఎం ఆనంద్ రెడ్డి, పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News