గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు ర్యాంప్ లు రోడ్ మీదకు రాకుండా, సెట్ బ్యాక్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకుండా నిబందనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలని, నిబందనలు పాటించని వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబోమని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ కోదండరామయ్య నగర్, ఉద్యోగ నగర్, ఎస్.వి.ఎన్.కాలని, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తదుపరి అనుమతులపై తగు ఆదేశాలు జారి చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమె నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎల్.టి.పి.లు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్ లైన్ ద్వారా డి.పి.ఎం.ఎస్.లో తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలు, నిబందనలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలని, లేకుంటే తదుపరి అనుమతుల జారీ నిలిపివేయడం జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ ఎలైన్మెంట్ కాని, లేదా మాస్టర్ ప్లాన్ లో చేసిన భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ అనుమతులు ఇవ్వబడవన్నారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. ర్యాంప్ లు రోడ్ మీదకు రాకుండా చూడాలని, అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం గ్రీనరికి కేటాయింపు ఉండాలన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ లు నామమాత్రం కాకుండా పక్కాగా పని చేసేలా కనెక్షన్ చేయాలన్నారు. ర్యాంప్ లు రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు జరిగే సమయంలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిర్దేశిత అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించాలని ఆదేశించారు. అలాగే ప్లానింగ్ కార్యదర్శులు తప్పనిసరిగా భవన నిర్మాణ అనుమతులు, ప్రణాళిక విభాగానికి సంబందించిన నిబందనలు, చట్టాలపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు.పర్యటనలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ సిటి ప్లానర్లు అశోక్ కుమార్, అజయ్ కుమార్, టిపిఎస్ హృదయరాజు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News