-ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తాం కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించిన రీవైజ్డ్ షెడ్యూల్ కి అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ పబ్లికేషన్, తుది ఓటరు జాబితా ప్రచురణ పూర్తి చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎమ్. ముకేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ లతో స్పెషల్ రేవైజ్డ్ సమ్మరీ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ మాధవీలత, డి ఆర్వో జి. నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశంలో ఆమేరకు చర్చించి, వారు చేసిన సూచనలు పరిగణన లోకి తీసుకోవడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కు చెంది కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నాటికి సమగ్ర నివేదికను ఫారం 1 నుంచి 8 వరకు తయారు చేసి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. సప్లిమెంటరీ, సమగ్ర ముసాయిదా ఓటరు జాబితా కి చెంది అక్టోబర్ 10 నుంచి 26 వరకు పనులను పూర్తి చెయ్యడం తోపాటు అక్టోబర్ 27న ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 9 వరకు వాటిపై క్లైయి మ్స్, అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. వాటిని పరిశీలించి డిసెంబర్ 26 నాటికల్లా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన జవాబుదారీ తనం తో కూడిన ఓటరు జాబితాను జనవరి ఒకటి 2024 నాటికి సిద్దం చేసి సమర్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుది ఓటర్ల జాబితా ను 2024 జనవరి 5 వతేది నాటికి ప్రచురించడం జరుగుతుందని మాధవీలత తెలియ చేశారు.
Prajavartha Online Telugu News