-జన గణనపై అపోహలు వీడి ప్రజలందరూ సహకరించాలి
-దేశాభివృద్ధికి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు జనగణన కీలకం
-గురువారం శ్యామలా నగర్ లో జనగణని ప్రత్యక్ష్యంగా చేపట్టిన కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశాభివృద్ధికి మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు అత్యంత కీలకమైన ‘జన గణన 2027’ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. గురువారం శ్యామల నగర్ 9వ లైన్ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణన కార్యక్రమాన్ని చార్జ్ ఆఫేసర్ సిహెచ్.శ్రీనివాస్ తో కలిసి, క్షేత్రస్థాయిలో సందర్శించి, స్వయంగా పలు గృహాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి వివరాలను సేకరించడానికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, ఈ వేగంతో సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి నగరవ్యాప్తంగా మిగిలి ఉన్న గణనను రాబోయే రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క ఇళ్లు విస్మరించబడకుండా అత్యంత జాగ్రత్తగా ప్రతి ఇంటి నంబరు, కుటుంబ సభ్యుల ప్రాథమిక వివరాలు మరియు నివాస వసతుల సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. నగరంలో 1310 హౌస్ లిస్టింగ్ బ్లాక్ లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనికోసం 1272 మంది ఎన్యుమరేటర్లను, 201 సూపర్వైజర్లను, ముగ్గురు ఛార్జ్ అధికారులను నియమించామన్నారు. గణన కోసం వచ్చే ఎన్యూమరేటర్లు అందరూ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులతో వస్తారని, ఈ ప్రక్రియలో సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు గానీ, ఫోన్ కు వచ్చే పిన్ లేదా ఓటీపీ వంటి సమాచారాన్ని అడగరని, ఎవరైనా అపరిచితులు ఇటువంటి వివరాలు అడిగితే వారు అధికారిక సిబ్బంది కాదని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. స్వీయ నమోదు చేసుకున్న వారు జనగణనకు వచ్చే సిబ్బందికి తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని తెలపాలని సూచించారు. జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా కాల్ సెంటర్ 0863-2345105 ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి లక్ష్యాల నిర్ణయంలో ఈ గణన డేటా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నందున, ప్రజలందరూ తమ వద్దకు వచ్చే సిబ్బందికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News