– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను పెంచడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు ఉదయం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.3.29, డీజిల్ పై రూ.3.14, కిలో సిఎన్జి గ్యాస్ పై రూ.2 లు పెంచుతూ, తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రకటించింది. ఇటీవల కాలంలో లేని విధంగా ఈ ధరలను విపరీతంగా పెంచింది. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరల భారం ప్రజలపై మోపటం దుర్మార్గం. నిన్నటిదాకా సోషల్ మీడియాలో బిజెపి కార్యకర్తలు “ఇతర దేశాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ ఉంటే, భారతదేశంలో నరేంద్ర మోడీ పెంచకుండా పరిపాలిస్తున్నారంటూ” మోడీ ఫోటోలతో ఊకదంపుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆయా రేట్లను విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరిచారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే దేశంలో మోడీ సర్కార్ కచ్చితంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారాలను ప్రజలపై మోపుతుందని సిపిఐతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ముందే చెప్పాయి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, విదేశాంగ విధానాల ఫలితంగా ప్రజలపై భారాలు పడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు మోడీ లొంగిపోయారు. ట్రంప్ ఆదేశాలను పాటిస్తూ భారతదేశ ప్రతిష్టను మంటగలిపారు. ఇరాన్, రష్యాల వద్దనుండి ఆయిల్ కొనొద్దంటూ ట్రంప్ చేసిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయిల్ కొనటం మానేశారు. ఒకవైపు ఆయిల్ కొరత ఉండగా, మరోవైపు ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వ అనాలోచిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు, ప్రజాతంత్ర వాదులంతా మోడీ ప్రభుత్వ చర్యలను పెద్ద ఎత్తున ఖండించాలని కోరుతున్నాం. దేశ ప్రజలంతా పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరల పెంపుపై ఎక్కడికక్కడ స్వతంత్రంగా, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
Prajavartha Online Telugu News