విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని సమావేశ హాలు లో నిర్వహించారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీలు, వార్డు అమినిటీస్ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, సంబంధిత అధికారులకు సిడిఎంఈ నుంచి వచ్చిన ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. నగరంలోని ప్రతి ఆస్తికి సాంకేతిక ఆధారిత డిజిటల్ గుర్తింపును కల్పించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పౌర సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో క్యూఆర్ కోడ్ ఆధారిత డోర్ నంబరింగ్ విధానం అమలు తీరు, యూఎల్బీ సరిహద్దుల నిర్ధారణ, రోడ్ల మ్యాపింగ్, ప్రతి ఆస్తి వివరాల సేకరణ, ప్రాపర్టీ పార్సెల్ మ్యాపింగ్, ఈఆర్పీ డేటా సమన్వయం, ఖచ్చితమైన భౌగోళిక గుర్తింపుల నమోదు తదితర అంశాలపై సవివరంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రతి ఆస్తికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ జెనరేషన్, డిజిటల్ డేటా సమగ్రత, భవిష్యత్ పట్టణ ప్రణాళికలో ఈ సమాచార వినియోగం వంటి అంశాలపై కూడా అధికారులకు మార్గదర్శకాలు అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిపాలనలో సాంకేతిక వినియోగాన్ని మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఈ డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతి సర్కిల్ నుండి 5 సెక్రటరీలకు శిక్షణ ఇచ్చారు. తదుపరి ఇప్పుడు శిక్షణ తీసుకున్న సెక్రెటరీలు సర్కిల్ పరిధిలో మిగతా సెక్రటరీలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా ప్రతి ప్లానింగ్, అడ్మిన్, ఎమినిటీ సెక్రటరీ డిజిటల్ క్యూ ఆర్ కోడ్ ద్వారా డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియ పూర్తి చేసేరా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జీ. సృజన, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ కమిషనర్లు, ప్లానింగ్, ఏమినిటీస్, అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News