గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులను, జంక్షన్లు, డివైడర్లు అభివృద్ధి చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులతో నగరంలోని ప్రధాన రహదారులు, జన్క్షన్లు అభివృద్ధి పై ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సంధర్భంగా కాకాని రోడ్డు వై జంక్షన్ వరకు రోడ్డు అభివృద్ధికి, గ్రీనరి అభివృద్ధికి ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు తయారు చేసిన డి.పి.ఆర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని రోడ్లు, జంక్షన్లు, సెంట్రల్ డివైడర్లు మరియు అవేన్యు ప్లాంటేషన్ అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో కాకాని రోడ్డు తో పాటు ఇంకా చుట్టుగుంట వద్ద గల వి.ఐ.పి రోడ్డు, ఆర్.టి.సి బస్టాండ్ వద్ద గల యన్.టి.ఆర్ బొమ్మ దగ్గర నుండి కంకర గుంట బ్రిడ్జ్ వరకు, లక్ష్మిపురం, విద్యానగర్ రోడ్డులలో కూడా రోడ్లు, జంక్షన్లు, సెంట్రల్ డివైడర్లు, రోడ్ మార్జిన్లలో ప్లాంటేషన్ పనులను అభివృద్ది చేయుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సదరు ప్రతిపాదనల్లో రోడ్లు, జంక్షన్లు, డివైడర్ల అభివృద్ధి ఆధునాతన హంగులతో ఎంతో ఆకర్షణీయంగా మరియు ప్రణాళికాబద్దంగా ఉండాలని, ముఖ్యంగా ఎవెన్యు ప్లాంటేషన్ తప్పకుండా ఉండాలని ఏపియుఐఎయంయల్ ప్రతినిధులను ఆదేశించారు. అలాగే సదరు ప్రతిపాదనలను త్వరితగతిన పూర్తి చేసి తీసుకువచ్చినట్లయితే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటె మార్పులు చేసి, జిల్లా కలెక్టర్ వారి ఆమోదంతో తుది ప్రతిపాదనలను ఆమోదిస్తామని తెలిపారు.
సమావేశంలో ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు శ్రీ కమల్, ఇర్ఫాన్ తదితరలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News