న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఢిల్లీలో నూతనంగా ప్రారంభం కానున్న లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
జూలై 17వ తేదీ సాయంత్రం జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆంధ్రప్రదేశ్ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంపోరియంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించిన ఆయన, సందర్శకులను ఆకట్టుకునేలా ఉత్పత్తుల ప్రదర్శన, అలంకరణ, నిర్వహణ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ OSD లక్ష్మీనాథ్, మేనేజర్ రోహిణి, అలాగే NID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) బృంద సభ్యులతో సమావేశమైన డా. హరిప్రసాద్ గారు పలు సూచనలు, సలహాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళల ప్రత్యేకత, నాణ్యత, కళాకారుల ప్రతిభ దేశ రాజధానిలోని ప్రతి సందర్శకుడికి చేరువయ్యే విధంగా ఎంపోరియం రూపకల్పన ఉండాలని సూచించారు. అలాగే ఈ నూతన లేపాక్షి ఎంపోరియం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ఒక విశిష్ట గుర్తింపును తీసుకురావడంతో పాటు, రాష్ట్ర కళాకారులకు విస్తృత మార్కెట్ అవకాశాలను కల్పించే వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. జూలై 17న జరిగే ప్రారంభోత్సవం ఢిల్లీలోని ప్రజలు, తెలుగు ప్రజలను ఆకట్టుకుని, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
లేపాక్షి ద్వారా రాష్ట్ర హస్తకళల వైభవాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, కళాకారుల అభివృద్ధికి అవసరమైన ప్రతి చర్యను చేపడుతున్నామని డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News