-లేపాక్షి ద్వారా రాష్ట్ర హస్తకళలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యం – డా. పసుపులేటి హరిప్రసాద్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పోలో రెండో రోజు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎక్స్పోలోని వివిధ హస్తకళా ప్రదర్శనలను సందర్శించిన డా. హరిప్రసాద్, రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత విస్తృత అవకాశాలు కల్పించే దిశగా పలువురు కొనుగోలుదారులు, పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమావేశమై చర్చలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా సహా విదేశీ దేశాలకు ఆంధ్రప్రదేశ్ హస్తకళా ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించేందుకు అవసరమైన వ్యూహాలపై అంతర్జాతీయ వాణిజ్య నిపుణురాలు శ్రీమతి అనుపమ గారితో సమావేశమయ్యారు. హస్తకళా ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ బ్రాండింగ్, మార్కెట్ అనుసంధానం, కొనుగోలుదారులతో వ్యాపార భాగస్వామ్యాలు, ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలపై సవివరంగా చర్చించారు. అదేవిధంగా FAB ప్రతినిధులతో సమావేశమైన డా. హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, శ్రీకాళహస్తి కలంకారీ, పెన్ కలంకారీ, లేస్ వర్క్, కార్పెట్స్ తదితర హస్తకళా ఉత్పత్తులను అంతర్జాతీయ కొనుగోలుదారులతో అనుసంధానం చేసి ఎగుమతులను పెంపొందించే అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా సంపదకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర కళాకారుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేసి వారికి స్థిరమైన ఆదాయం, విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. భారత్ టెక్స్–2026 వంటి అంతర్జాతీయ వాణిజ్య వేదికలు రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంటూ, లేపాక్షి బ్రాండ్ను మరింత బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.
Prajavartha Online Telugu News