విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం శాకాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో డిజిటలైజ్ చేసి, ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా డేటా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. డిజిటలైజేషన్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఫారాలు అందజేయని ఓటర్లను మరోసారి సంప్రదించి, అర్హులైన ప్రతి ఓటరి వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసి పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Prajavartha Online Telugu News