– పదో తరగతి విద్యార్థులకు హిందీ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
– ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక అధ్యయన పుస్తకం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా వినూత్న కృషితో అధ్యయన పుస్తకాలను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
కలెక్టర్ లక్ష్మీశ.. విద్యాశాఖ అధికారులతో కలిసి గురువారం కలెక్టరేట్లో హిందీ స్టడీ మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ముఖ్యమైన అంశాలను సమగ్రంగా పొందుపరిచిన ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు ఈ స్టడీ మెటీరియల్ను కూడా క్రమం తప్పకుండా అభ్యసిస్తే హిందీ సబ్జెక్టులో మంచి మార్కులు సాధించడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతులను అవలంబించడంతో పాటు ఇలాంటి నాణ్యమైన అధ్యయన సామగ్రిని రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ స్టడీ మెటీరియల్లో ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు, వ్యాకరణ అంశాలు, పరీక్షా విధానానికి అనుగుణమైన సూచనలు పొందుపరిచినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త రమేష్ బాబు, జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (DCEB) కార్యదర్శి ఉమర్ అలీ, హిందీ రిసోర్స్ పర్సన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News