న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి ఎంపోరియంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. డా. పసుపులేటి హరిప్రసాద్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సవితమ్మ కి APHDC మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ, రాష్ట్ర టెక్స్టైల్ కమిషనర్ రేఖారాణి, టీటీడీ పాలకమండలి సభ్యులు సుచరిత ఎల్లా, APHDC బోర్డ్ డైరెక్టర్ ఆర్డీఎస్ ప్రసాద్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి రాష్ట్ర హస్తకళల వైభవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా చాటిచెప్పే ప్రతిష్ఠాత్మక వేదికగా నిలుస్తోందన్నారు. హస్తకళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళల పరిరక్షణ, ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, న్యూఢిల్లీలో లేపాక్షి ఎంపోరియం ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఉత్పత్తులకు దేశ రాజధానిలో శాశ్వత వేదిక లభించిందన్నారు. ఈ ఎంపోరియం ద్వారా రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత గుర్తింపు లభించడంతో పాటు కళాకారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు, అధిక ఆదాయం సమకూరుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో హస్తకళా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి సవితమ్మ, డా. పసుపులేటి హరిప్రసాద్ మరియు ఇతర ప్రముఖులు ఎంపోరియంలో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి కళాకారుల ప్రతిభను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పోతుల సాయినాథ్, తిరుపతి సిటీ వైస్ ప్రెసిడెంట్ పార్థు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, హస్తకళాకారులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News