కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ వారి ఆధ్వర్యంలో కొవ్వూరులో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కొవ్వూరులో నిర్వహించే మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను హోంమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ మెగా జాబ్ మేళా ద్వారా 30కి పైగా ప్రముఖ దిగ్గజ కంపెనీలలో దాదాపు 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం మెగా జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఉద్యోగమేళా కార్యక్రమం ఈనెల 25వ తేదీన కొవ్వూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు ఉదయం 9:00 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగ మేళాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్ డేటా కలెక్షన్ ఏజెంట్స్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ వంటి జాబ్ లు అందుబాటులో ఉన్నాయని పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్ ,డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చేసినవారు ఈ ఉద్యోగులకు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువత తమకు అందోచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని జీవితాల్లో ముందుకు సాగాలని హోంమంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జొన్నకూటి సునీత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News